టీమిండియా ఆటగాళ్లకు తన నివాసంలో విందు ఏర్పాటు చేసిన గంభీర్

  • టీ20 వరల్డ్ కప్‌లో తొలి గెలుపు తర్వాత జట్టుకు గంభీర్ విందు
  • ఢిల్లీలోని తన నివాసంలో ఆటగాళ్లకు ప్రత్యేక ఆతిథ్యం
  • ఆటగాళ్లలో ఒత్తిడి తగ్గించి, బంధం పెంచడమే లక్ష్యం
  • ఈ కార్యక్రమానికి బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా కూడా హాజరు!
భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, టీ20 వరల్డ్ కప్‌లో శుభారంభం చేసిన టీమిండియాకు తన నివాసంలో ప్రత్యేక విందు ఏర్పాటు చేశాడు. అమెరికాపై తొలి మ్యాచ్‌లో విజయం సాధించిన అనంతరం, ఢిల్లీకి చేరుకున్న జట్టుకు ఆదివారం రాత్రి ఈ డిన్నర్ ఇచ్చాడు.

2026 టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా ఫిబ్రవరి 7న ముంబై వాంఖడే స్టేడియంలో అమెరికాతో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ 29 పరుగుల తేడాతో గెలిచింది. ఈ విజయంతో టోర్నీని ఘనంగా ప్రారంభించిన సూర్యకుమార్ యాదవ్ సేన, తమ తదుపరి మ్యాచ్ కోసం ఢిల్లీకి చేరుకుంది. ఫిబ్రవరి 12న అరుణ్ జైట్లీ స్టేడియంలో నమీబియాతో భారత్ తలపడనుంది.

ఈ నేపథ్యంలో ఢిల్లీలోనే నివాసముంటున్న గంభీర్, జట్టుకు తన ఇంట్లో ఆతిథ్యం ఇచ్చాడు. ఆటగాళ్లు, సహాయక సిబ్బందిని తన కుటుంబ సభ్యులతో కలిసి సాదరంగా ఆహ్వానించాడు. 

కోచ్‌గా గంభీర్ జట్టుకు ఇలా డిన్నర్ ఇవ్వడం ఇది రెండోసారి. గతంలో శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని టెస్టు జట్టుకు కూడా ఢిల్లీలో మ్యాచ్‌కు ముందు విందు ఇచ్చాడు. ఆటగాళ్లతో వ్యక్తిగత సంబంధాలను బలోపేతం చేసుకోవడంలో భాగంగానే గంభీర్ ఈ కార్యక్రమాలు చేపడుతున్నాడని క్రికెట్ వర్గాలు అంటున్నాయి. కాగా, నేటి విందుకు బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా కూడా హాజరైనట్లు సమాచారం.

Gautam Gambhir
Team India
T20 World Cup
Indian Cricket Team
Dinner Party
Rajeev Shukla
Suryakumar Yadav
India vs Namibia

More Telugu News